Nara Lokesh: విద్యారంగ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు
ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను అందుకోవడమే లక్ష్యం
ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్ లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. విద్యారంగంపై క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్ సెంటర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని, ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే అవకాశాలను ఏపీలోని యువత అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గవర్నెన్స్ లో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఏఐ ద్వారా విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్ లర్ మార్క్ హార్వే, క్వీన్స్ ల్యాండ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ కమిషనర్ మిచైల్ మాథ్యూస్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ గార్బియేల్ ట్రూన్, స్టడీ క్వీన్ ల్యాండ్ అడిషనల్ డైరెక్టర్ స్టెఫానీ హంటర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ మెరైన్ బయోలజీ, ఆక్వాకల్చర్ ప్రొఫెసర్ క్యాల్ జెంజర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్ ల్యాండ్ ప్రొ వైస్ ఛాన్స్ లర్ రెన్ యూ, సిక్యూ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మీనూ ఇస్సార్, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ సెంటర్ డైరెక్టర్ (క్వాంటమ్ సిస్టమ్స్) ఆండ్రూ రైట్, స్ట్రాటజీ మేనేజర్ శరవణన్, ఎడ్యుకేషన్ క్వీన్స్ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డంకెన్ మెక్ కెల్లర్ తదితరులు పాల్గొన్నారు.