Nara Lokesh: సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్ వర్కింగ్ కు సహకారం అందించండి
ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు కలిసి పనిచేయండి
ఆస్ట్రేలియా (సిడ్నీ): సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సిడ్నీ సమీపాన పారమట్టాలో భేటీ అయ్యారు. సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) సీఈవో వెరోనికా పాపకోస్టా మాట్లాడుతూ… 2017 నుండి ప్రారంభమైన SIA లో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని చెప్పారు. బయో సెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరచేందుకు ప్రభుత్వ, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రగామిగా ఉంది. దేశం మొత్తమ్మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60శాతానికి పైగా వాటా కలిగి ఉంది, 2024-25లో $7.4 బిలియన్ డాలర్ల (రూ.66 వేలకోట్లు) విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆస్ట్రేలియా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టండి. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతి దారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయండి.
ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్ మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయండి. పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన ఆక్వా కల్చర్, మత్స్య సంపద నిర్వహణకు ఏపీ ఆక్వా పరిశ్రమదారులతో కలిసి నైపుణ్యాన్ని పంచుకోండి. ఆంధ్రప్రదేశ్ సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టండి. సముద్ర మట్టాల పెరుగుదల, తీవ్రమైన వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేలా ఆంధ్రప్రదేశ్ సీఫుడ్ పరిశ్రమలో నిరోధకశక్తిని పెంచే ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.