AP-Singapore: చంద్రబాబు, షణ్ముగం సమక్షంలో ఏపీ-సింగపూర్ మధ్య ఎంఓయూ
ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలతో కలిసి పని చేసేందుకు ఏపీ సిద్ధం
ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం
సింగపూర్ బృందంతో ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం
ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్న మంత్రి నారా లోకేష్ – సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని నిర్ణయం
విశాఖపట్నం, నవంబర్ 14:- సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు ఇన్నోవేటివ్ ఆలోచనలతో పరిశ్రమలు నడిపిస్తాయని…ఇలాంటి ఆలోచనలతో ముందుకు వచ్చే సింగపూర్ కంపెనీలతో పనిచేసేందుకు ఏపీ ఉత్సాహంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ హోం శాఖామంత్రి షణ్ముగం సమక్షంలో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్-సింగపూర్ విదేశీ వ్యవహరాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్ ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు. అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ప్రపంచానికి అభివృద్ధి మోడల్ గా మారిన సింగపూర్ అంటే నాకు అమితమైన అభిమానం. అత్యంత బలమైన పబ్లిక్ పాలసీలు ఆ దేశంలో అద్భుతమైన అభివృద్ధికి కారణం అయ్యాయి. లీక్వాన్యూ లాంటి నేతలు సింగపూర్ను అద్వితీయమైన దేశంగా మలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధిలో భాగం అయ్యాను. ఇప్పుడు మళ్లీ అమరావతిని నిర్మించే భాగ్యం నాకు కలిగింది. కోరగానే అమరావతి బృహత్ ప్రణాళికను రూపొందించి ఇచ్చిన సింగపూర్కు ధన్యవాదాలు. మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడినా మళ్లీ రాజధానిని పునర్నిర్మిస్తున్నాం. రాష్ట్రాన్ని నాలెడ్జి ఎకానమీగా తీర్చిదిద్దుతున్నాం. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. గత ఆరు దశాబ్దాలుగా సుస్థిరమైన ప్రభుత్వం సింగపూర్లో ఉంది. ఇప్పుడు భారతదేశం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ, ఎన్డీఏపై ప్రజలకు విశ్వాసం ఉంది. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మద్దతుతో భారీ విజయాన్ని సాధించింది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
అద్భుతమైన ప్రయాణానికి నాంది: నారా లోకేష్
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…‘ఏపీ -సింగపూర్ మధ్య కుదిరిన ఎంఓయూ ఓ అద్భుతమైన ప్రయాణానికి నాంది. రెండో ఛాన్స్ ఇచ్చినందుకు సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పాలనలో అపారమైన అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది. సింగపూర్ అభివృద్ది వేగాన్ని ఏపీ అందుకునేలా పని చేస్తాం’ అని చెప్పారు. ఇక సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి గాన్ సో హాంగ్ మాట్లాడుతూ ఏపీ- సింగపూర్ మధ్య బంధం మరింతగా బలపడాలని కోరుంటున్నామన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలని ఆకాంక్షించారు. సుస్థిరాభివృద్ధి, డిజిటల్, అర్బన్ గవర్నెన్సు, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని గాన్ సో హాంగ్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ- సింగపూర్ మధ్య వారంలో మూడు రోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటించారు. ఇప్పటికే విశాఖ నుంచి సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. సింగపూర్ మోడల్ను సీఎం చంద్రబాబు విశ్వసిస్తారని.. తాము ఆయన్ను విశ్వసిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
సింగపూర్ హోం మంత్రి షణ్ముగం మాట్లాడుతూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మార్చడానికి స్వర్ణాంధ్ర విజన్ చేపట్టడం సంతోషదాయకమన్నారు. సింగపూర్- ఏపీ మధ్య బలమైన బంధం ఉందని… ఏపీలో సింగపూర్ కంపెనీలకు పూర్తి సహకారం అందుతోందని చెప్పారు. అభివృద్ధిలో పరస్పర భాగస్వామ్యం అత్యంత కీలకమని షణ్ముగం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కుదుర్చుకుంటున్న ఒప్పందాలతో ఏపీ అభివృద్ధి ప్రయాణం వేగంగా జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ద్వారా ఏపీతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలును పర్యవేక్షిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.






