Trump: సుంకాలపై భారత్ దిగొచ్చిందన్న ట్రంప్.. సత్సంబంధాలకోసమే అన్న ఇండియా..

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్(Trump) వెల్లడించారు. వారు ఇంతవరకు చేసినదాన్ని ఇప్పుడు ఎవరో ఒకరు బయటపెడుతున్నందున పన్నులు తగ్గింపునకు అంగీకరించారని వ్యాఖ్యానించారు.ట్రంప్ ప్రకటన మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న కొద్ది నెలల్లో వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా భారత్ మార్కెట్లో ప్రవేశించనుంది. టెస్లా వాహనాలపై భారత్ ప్రస్తుతం 110శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలను భారత అధికారిక వర్గాలు మాత్రం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ.. టారిఫ్ ట్రేడ్ ఎఫెక్ట్ తో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
‘‘గతంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్..యూకేతోనూ పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వీటిని తగ్గించాలని న్యూఢిల్లీ నిర్ణయం తీసుకుంది. అంతే కానీ, అమెరికా భారత్పై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదని భారతవర్గాలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
వ్యవసాయ ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని వస్తువులపై సుంకాలను తొలగించాలని అమెరికా భారత్ను కోరింది. న్యూఢిల్లీకి వాషింగ్టన్(Washington) అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా 2030 నాటికి దీనిని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తోంది. గత నెల ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో 2025 చివరి నాటికి.. ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్ అంగీకరించారు. ఇందులో భాగంగానే మరిన్ని వస్తువులకు మార్కెట్ను తెరవడం, సుంకాల అడ్డంకులను తొలగించడానికి ఇరుదేశాల నేతలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీని టారిఫ్ కింగ్గా అభివర్ణిస్తూ.. తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఏప్రిల్ 2న భారత్, చైనాలపై విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బీటీఏ కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.