తానా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు
పుట్టిన గడ్డకు సేవ చేయడం మరువలేనిదని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఎస్డీఎం సిద్ధార్థ మహిళా కళాశాలలో తానా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర చదరంగ సంఘం సహకారంతో రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న తానా రాష్ట్ర స్థాయి చెస్ స్కాలర్ షిప్ టోర్నీ ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్ గోగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ టోర్నీలో విజేతగా నిలిచిన విద్యార్థికి ప్రథమ బహుమతిగా రూ.50,000, ద్వితీయ బహుమతిగా రూ.30,000, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలబాలికలకు వేర్వేరుగా చెరో రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తుమ్మల విజయలక్ష్మి, తానా ప్రాంతీయ సంచాలకుడు వేమూరి సతీష్, రాష్ట్ర చదరంగ సంఘం కార్యదర్శి డి. శ్రీహరి, ఎస్కేఖాశీం, తదితరులు పాల్గొన్నారు.













