NATS: ఘనంగా ముగిసిన నాట్స్ సంబరాలు… బాలకృష్ణకు జీవిత సాఫల్యపురస్కారం
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జూలై 6వ తేదీన వివిధ కార్యక్రమాలతో, ప్రముఖుల ప్రసంగాలతో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(NATS) 8వ తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజున వేడుకలకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వేలాదిమంది రాకతో వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలతో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు మహాసభల విజయవంతానికి కృషి చేశారు. సంబరాల కమిటీ చైర్ లు, సభ్యులు ఈ మహాసభల విజయవంతం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ సంబరాలకు పలువురు హీరో హీరోయిన్ లు, దర్శక నిర్మాతలు, బుల్లితెర నటీ నటులు, సంగీత దర్శకులు పలువురు తరలివచ్చారు.
చివరిరోజైన జూలై 6వ తేదీ కార్యక్రమాలు భక్తిసంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలతోపాటు మెడ్లీ డ్యాన్స్లతో ప్రారంభమయ్యాయి. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవచనకర్త ఎల్.వి. గంగాధర శాస్త్రి గీత ప్రవచనం, హరికథ వంటి కార్యక్రమాలు జరిగాయి. యూత్ కళాకారులు టాలీవుడ్ మెడ్లీ, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలను ప్రదర్శించారు. టాలీవుడ్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మెడ్లీ పాటలు అలరించాయి. అలాగే బాలకృష్ణ ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా విక్టరీ హీరో వెంకటేశ్ మాట్లాడుతూ, సహనశీలురకు విజయం తప్పక లభిస్తుందని, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలనేది దైవనిర్ణయమని అన్నారు. ఈ వేడుకల్లో ఆయన లోతైన ప్రసంగం చేశారు. ఓర్పుగా ఉంటే ఒత్తిడి తొలగుతుందని, ప్రపంచం అందంగా ఉంటుందని, అందరూ సంతోషంగా ఉంటారని వెంకటేష్ అన్నారు. చిరంజీవితో ఒక సినిమా, త్రివిక్రంతో ఒకటి, మీనాతో దృశ్యం, బాలకృష్ణతో మరొక సినిమా చేస్తామని వెంకీ అన్నారు. నాట్స్ సంబరాలు ఇంత వైభవంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తనను ఈ సంబరాలకు ఆహ్వానించినందుకు నాట్స్ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ వేడుకల్లో నందమూరి బాలకృష్ణను నాట్స్ నాయకులు జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. సంబరాల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలతో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు బాలయ్యను సత్కరించారు. నాట్స్ సంస్థ బసవతారకం ఆసుపత్రికి భారీ విరాళం ఇచ్చింది. తన వ్యక్తిత్వాన్ని చూసుకునే తనకు పొగరని, తమను తాము అందరూ తెలుసుకుని ప్రేమించడం నేర్చుకోవాలని బాలకృష్ణ తన ప్రసంగంలో కోరారు. ఎన్టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. నందమూరి రామకృష్ణ, అట్లూరి అశ్విన్లు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జయసుధ, మీన, దర్శకుడు గోపీచంద్, బండ్ల గణేష్, వివేక్ ఆత్రేయ తదితరులను నాట్స్ పురస్కారాలతో సత్కరించారు. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు పలువురు కూడా ఈ సంబరాలకు తరలివచ్చారు. తంగిరాల సౌమ్య, గౌతు శిరీష్, వసంత కృష్ణప్రసాద్, అరవిందబాబు, రఘురామకృష్ణరాజు తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బాపు నూతి, కొత్తా శేఖరంలు ప్రవాస తెలుగు విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు.
సంబరాల చివరి రోజు ఆదివారం నాడు పాత టీవీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఆలపించి స్థానిక ప్రవాస చిన్నారులు హుషారెక్కించారు. పిన్ని, మెట్టెలసవ్వడి, లేడి డిటెక్టివ్, అమృతంతో పాటు ప్రఖ్యాత వాణిజ్య ప్రకటనలు లైఫ్బాయ్, జండూ బాం, వికో, నిర్మా, పెప్సీ పాటలను ఆలపించి అతిథుల చేత శెభాష్ అనిపించారు. ప్రవాస యువతీయువకుల కోసం వధూవరులను వెదికేందుకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ పిల్లల జీవితభాగస్వాములను వెదికేందుకు సహకరించారు. ప్రస్తుత సినిమాల్లో ఆలోచన రేకెత్తించేవి, ఉత్సేజపరిచేవి, ప్రేరణాత్మకమైనవి ఎందుకు రావట్లేదనే ప్రవాసుల ప్రశ్నలకు రచయిత తనికెళ్ల భరణి సమాధానమిచ్చారు. తమ వద్ద, తన లాంటి రచయితల వద్ద కావల్సినంత జలం(ప్రతిభ) ఉందని, కానీ దాన్ని తోడి తీసుకోగలిగే సామర్థ్యమున్న వ్యక్తులు (నిర్మాతలు, దర్శకులు, హీరోలు) దొరకడం అరుదుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.
టాంపాలో నాట్స్ సంబరాల్లో ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం చలనచిత్ర గీత రచయితలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాట గతి, తమకు ఎదురయ్యే సవాళ్లు, ఆలోచనా సరళి, పాట క్రమం, పాట రూపం వంటివాటిపై విస్లేషనాత్మకంగా మాట్లాడారు. మిథునం సినిమా వెనుక ఉన్న అరుదైన అనుభవాలను భరణి సభికులతో పంచుకున్నారు. రామజోగయ్య, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవతి, వీణాపాణి, వివేఖ్ ఆత్రేయలు ప్రసంగించారు. కొండవీటి జ్యోతిర్మయి స్థానిక చిన్నారులతో కలిసి కచేరీ నిర్వహించారు. మన్నవ సుబ్బారావు, కుచిభొట్ల ఆనంద్, యడ్ల హేమాప్రసాద్, కె.వి.రావు, శశికాంత్ వల్లేపల్లి, ఐకా రవి, తాళ్లూరి రాజా, తోటకూర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చివరన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరితో కార్యక్రమాలు ముగిశాయి. సూపర్ హిట్ చిత్రాల్లోని పాటలను పాడి, మ్యూజిక్ ను అందించి తమన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.







