BATA: వైభవంగా ‘బాటా’ సంక్రాంతి సంబరాలు!
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. అమెరికాలో సైతం అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వంటల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, మెలోడీ పాటల పల్లకి వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత కచేరీ, క్లాసికల్ డాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, వేదికపై గేమ్ షో, డ్యాన్స్లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వండిన 36 రకాల రుచికరమైన వంటకాలతో కూడిన విందు భోజనాన్ని ఆహూతులు ఆరగించారు. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై రాత్రి 9:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఆడిటోరియం మొత్తం సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించేలా తెలుగు లోగిళ్లను తలపించేలా ఆడిటోరియాన్ని అద్భుతంగా అలంకరించారు.
ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్డ్రాప్లు, రంగురంగుల గాలిపటాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు, కంటెస్టెంట్లు, బాటా వాలంటీర్ల సంప్రదాయ దుస్తులు, వారి అలంకరణలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమం నోరూరించే విందు భోజనంతో ప్రారంభమైంది.36కు పైగా వంటకాలతో సంక్రాంతి విందు భోజనం వండి వార్చారు. సంప్రదాయ తెలుగు మిఠాయిలు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడి, పులిహోర, పనసపట్టు పలావ్, పెరుగన్నం, గుత్తి వంకాయ, బెండకాయ్ ఇగురు, ముద్ద పప్పు, దప్పలం, వడియాలు, కిల్లీ (పాన్)లతో పాటు ఇతర ఆహార పదార్ధాలతో ఆహూతులకు తెలుగింటి విందు భోజనం వడ్డించారు. బిర్యానీ జంక్షన్ వారు తయారు చేసిన ఈ రుచికరమైన విందు భోజనాన్ని.. ముఖ్యంగా స్వీట్స్, స్నాక్స్ను అతిథులు నోరారా ఆస్వాదించారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) భారత గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై అతిథులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ రాకేష్ అడ్లఖాతో పాటు 25 మంది అధికారులు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మ్యాన్ శామ్ లికార్డో ఆఫీస్ రిప్రజెంటేటివ్గా కాంగ్రెస్ మ్యాన్ రో ఖన్నా హాజరు కాగా… అసెంబ్లీ సభ్యులు యాష్ కల్రా, అలెక్స్ లీ, సూపర్ వైజర్లు ఒట్టో లీ, ఎలీసా మార్క్ వెజ్.. మేయర్లు రాజ్ సాల్వన్, కార్మెన్ మోంటానో, ల్యారీ కైలెన్, మైక్ హానోన్, సెర్గియో లోపెజ్, లియాంగ్ చావో.. కౌన్సిల్ మెంబర్లు మురళీ శ్రీనివాసన్, డెస్రీ క్యాంప్ బెల్, కేథీ కింబర్లిన్, యాజింగ్ ఝాంగ్, ఎల్వెలిన్ ఛౌ, యాంగ్ షావో, రేమండ్ లియూ, రాజ్ చహల్, శ్రీధర్ వెరోస్, విలియం లాం.. స్కూల్ బోర్డ్ మెంబర్స్ అను నక్కా, రీనూ నాయర్ లతో పాటు పలువురు అధికారులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారందర్నీ ఉద్దేశించి కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి మాట్లాడారు. వారికి సంక్రాంతి, భారత 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన AIA, BATA సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC) కో ఫౌండర్ తలత్ హసన్, సీఈవో మనోజ్ గోయల్, మిగతా ICC సభ్యులకు AIA బృందం ధన్యవాదాలు తెలిపింది. చిన్నారుల డ్యాన్స్, పాడిన దేశభక్తి గీతాలు, పాటల పల్లకి తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తానా, బాటా ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన తెలుగు ‘‘పాఠశాల’’ విద్యార్థులు చేసిన స్కిట్ అలరించింది. పెద్దలకు రంగవల్లి, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. AIA ఐడల్ (పాటల పోటీ) కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈస్ట్ బే కరోకే (EBK) & BATA/AIA కరోకే బృందాలు సంయుక్తంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ గ్రాండ్ ఈవెంట్కి పలు వ్యాపార సంస్థలు, పలువురు వ్యాపారవేత్తల నుంచి భారీ మద్దతు, స్పాన్సర్ షిప్ లభించింది. ‘పవర్డ్ బై’ స్పాన్సర్ రియల్టర్ నాగరాజ్, అన్నయ్యగోల్డ్ స్పాన్సర్ ‘శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్’ ఇతర స్పాన్సర్లు రియల్టర్ శిఖా కపూర్, ఇన్ స్టా సర్వీస్, పీఎన్ జీ జ్యూవెలర్స్, MCS మాస్టర్ క్లాస్ అండ్ మహాకాల్ టెంపుల్ వాలంటీర్లు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు BATA అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు.
శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన BATA ఎగ్జిక్యూటివ్ కమిటీ, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన ‘స్టీరింగ్ కమిటీ’, శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన ‘సాంస్కృతిక కమిటీ’, సందీప్ కేదార్ శెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన ‘లాజిస్టిక్స్ టీమ్’ సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూరలతో కూడిన యూత్ కమిటీ, కల్యాణి, కృష్ణప్రియ, దీప్తి, స్రవంతిలతో కూడిన ఆర్ట్ అండ్ డిజైన్ కమిటీలను కొండల్ కొమరగిరి సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన BATA బృందానికి BATA ‘సలహా మండలి’ సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు.







