ATA: సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఆటా కార్యక్రమాలు
ఆటా వేడుకలు – 2025లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలో డల్లాస్కు చెందిన ఆటా సభ్యులు రవి వెనిశెట్టి, షీలా వెనిశెట్టి తమ దివంగత కుమారుడు నిశాంత్ స్మృతిగా ప్రారంభించిన నిశాంత్ బాలసదన్లో ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ, వసతి, భోజనం, విద్య, వైద్యం, రవాణా, సహపాఠ్య కార్యకలాపాలు వంటి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆటా ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఆటా ఇతర ప్రతినిధులు హాజరై బాలలతో కలిసి సమయం గడిపారు. ఆటా సంస్థ సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ముఖ్యంగా అనాథ, అవసరమైన పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని వారు తెలిపారు.
బాలల చిరునవ్వులే తమకు అతిపెద్ద ప్రోత్సాహమని పేర్కొన్నారు. అనంతరం ఆటా తరఫున రూ.2 లక్షల విరాళాన్ని (వాషర్, డ్రైయర్ వంటి అవసరాల కోసం) అందించగా, సియాటిల్కు చెందిన సుమంత్ తన సంస్థ ద్వారా మరో రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా డేటా (ణAుA) ద్వారా రఘు మార్పెడ్డి ఒక సంవత్సరం నిర్వహణ ఖర్చుల కోసం సుమారు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ హాజరై విరాళాలు ప్రకటించిన ఆటా టీం, ఇతర ఎన్ఆర్ఐ సభ్యులను అభినందించారు.
అనంతరం క్రిస్మస్ సందర్భంగా సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఆటా సభ్యులు వేణుగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సాంటాక్లాజ్గా మారి ఆటా సహకారంతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ (1000 వాట్స్), 12 తరగతులకు ఇంటర్కామ్ వ్యవస్థ, క్రీడా సామగ్రి (క్రికెట్, వాలీబాల్, షటిల్, ఫుట్బాల్స్, క్యారమ్ బోర్డులు), షూస్, కబడ్డీ జెర్సీలు, జియోమెట్రీ బాక్సులు, ల్యాబ్ పరికరాలు వంటి విలువైన సామగ్రిని విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ఆటా ప్రతినిధులు హాజరై ఆటా భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, సమాజంలో మార్పుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం హాజరై ఆటా టీం, ఇతర ఎన్ఆర్ఐ సభ్యులను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.













