మంత్రి లోకేశ్ ఆదేశంతో తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశంతో థాయ్లాండ్ ( Thailand)లో చిక్కుకున్న ఐదుగురు తెలుగు విద్యార్థుల (Telugu students)ను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందని ఏపీ భవన్ కమిషనర్ తెలిపారు. అవకాశం ఉన్నంత త్వరగా విద్యార్థులను వెనక్కి పంపాలని థాయ్లాండ్లోని భారత ఎంబసీ అధికారులను కమిషనర్ కోరారు.
ఉద్యోగం పేరుతో థాయ్లాండ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న కొందరు తెలుగు యువకులు తమను రక్షించాలంటూ వేడుకున్నారు. తమను మయన్నార్ (Myanmar) తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియా (Social media) వేదికగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి లోకేశ్ స్పందించారు. మీ ఆందోళన, ఆవేదన అర్థమైంది. అధికారులతో మాట్లాడి తగిన సహాయం అందిస్తాను. విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. వారిని రక్షించే చర్యల్ని సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ అధికారులు రంగంలోకి దిగారు.








