ఆంధ్రప్రదేశ్లో “బెస్” తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
డెల్టా ఎక్స్ సీఈవో స్టీఫెన్ కిమ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): మెషిన్ విజన్, ఎడ్జ్ AI, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS)లో ప్రత్యేకత కలిగిన డెల్టా ఎక్స్ – DeltaX (దక్షిణ కొరియా) ఫౌండర్ & సీఈవో స్టీఫెన్ కిమ్, సంస్థ నాయకత్వ బృందంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ 160 GW గ్రీన్ ఎనర్జీ, 25 GW BESS ప్రాజెక్టుల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్-గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకోసిస్టమ్ను నిర్మిస్తోంది. పోర్టు యాక్సెస్ తోపాటు మౌలిక సదుపాయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తయారీ యూనిట్ నెలకొల్పండి. యుటిలిటీ-స్కేల్ స్టోరేజ్, డేటా-సెంటర్ ఆపరేటర్లు, ఇండస్ట్రియల్ పార్కుల కోసం రాష్ట్ర డిస్కమ్లు, పునరుత్పాదక ఇంధన డెవలపర్లతో అనుసంధానించడం ద్వారా మార్కెట్ ఇంటిగ్రేషన్ ప్రారంభించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. డెల్టా ఎక్స్ సీఈవో స్టీఫెన్ కిమ్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియాలో సెప్టెంబర్ 2020లో స్థాపితమైన తమ సంస్థ భారత కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటుచేసినట్లు చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో BESS తయారీ యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.








