ఆసిస్, న్యూజిలాండ్ లో మోడీ క్రికెట్ దౌత్యం..!
సాదారణంగా ఏ దేశాధిపతైనా.. ఇతర దేశాల్లో పర్యటించేటప్పుడు దౌత్యపరంగా పర్యటనలు సాగిస్తారు. అయితే కొందరు మాత్రమే.. ఇతర దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటారు. మిత్ర బంధాలను చిరకాలం కొనసాగిస్తారు. వాటిని అత్యవసర సమయాల్లో వాడి సమస్యలు పరిష్కరించుకుంటారు. అందులో ఒకరు భారత ప్రధాని మోడీ. ఇటీవల ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ గ్రౌండ్ లో క్రికెట్ దౌత్యాన్ని పరిచయం చేసిన మోడీ.. న్యూజిలాండ్ లోనూ క్రీడా దౌత్యానికి మరింత పదనుపెట్టారు.
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో పర్యటించిన మోడీ… ఇరుదేశాల మధ్య క్రీడలు ఒక శక్తిమంతమైన వారధిగా పనిచేస్తున్నాయని, ఇరు దేశాల ప్రజలను బలంగా కలుపుతున్నాయని పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో కలిసి ఆక్లాండ్లో జరిగిన ‘స్పోర్టింగ్ షోకేస్’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
“భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడలు ఎల్లప్పుడూ బలమైన వారధిగా నిలిచాయి. ఈ ఏడాదితో మన మధ్య క్రీడా సంబంధాలు ఏర్పడి ఒక శతాబ్దం పూర్తవుతోంది. ఆక్లాండ్లో ప్రధాని లక్సన్తో కలిసి నేను పాల్గొన్న స్పోర్టింగ్ షోకేస్లో అత్యాధునిక క్రీడా ఆవిష్కరణలను చూశాను. టెక్నాలజీ, సృజనాత్మకత క్రీడల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతున్నాయో, మన రెండు దేశాలను మరింత దగ్గరికి ఎలా చేరుస్తున్నాయో చూడటం అద్భుతంగా ఉంది” అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడా భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనే తన విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని మోడీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహాలో క్రీడా సంబంధాలపై దృష్టి సారించారు. మెల్బోర్న్లోని చారిత్రక క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా క్రీడా సంబంధాల వేడుకలో మోడీ పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా ప్రీమియర్ జెసింటా అలన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అక్కడ క్రికెట్, కబడ్డీ, ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ ఆడుతున్న యువ క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా క్రీడా దిగ్గజాలైన స్టీవ్ వా, లీసా స్థలేకర్ వంటి వారు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ కలిసి ‘భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్మ్యాప్’ను ప్రారంభించారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో క్రీడలు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు కీలక స్తంభాలని ఈ రోడ్మ్యాప్ నొక్కి చెబుతోంది.
భవిష్యత్ దశాబ్దంలో క్రీడా రంగంలో సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోడీ అన్నారు. భారత్ 2030లో కామన్వెల్త్ క్రీడలకు, ఆస్ట్రేలియా 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో క్రీడలు, సంబంధిత పరిశ్రమలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఇది ఒక సహజమైన అవకాశమని ఆయన వివరించారు. ఇదే సమయంలో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు మోడీ అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యం, యువత భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో కలిసి పనిచేయడానికి గొప్ప అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.








