ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం.. 19న పోలింగ్!

దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ శరవేగంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా.. అందులో తొలి దశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఈ దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు… కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాగా.. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.