కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇకలేరు
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు అహ్మద్ పటేల్ మరణించారని ఆయన తనయుడు పైసల్ పటేల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా శరీరంలోని పలు అవయవాలు సరిగా పని చేయకపోవడం (మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 15 నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అహ్మద్ పటేల్ సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడంతో దిట్టగా పేరుగాంచారు.













