కరోనా టీకా రెండో డోసు తీసుకున్న జో బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల జో బైడెన్ 2020 డిసెంబర్ 21న ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. బైడెన్ టీకా తీసుకున్న ఈ ఘట్టాన్ని ఆ సమయంలో అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రజల్లో వ్యాక్సిన్పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరోసారి టీకా రెండో డోసు తీసుకున్నారు. ఎవరైనా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాక.. రెండు డోసును తీసుకోవాల్సిందే. ఇందులో భాగంగానే బైడెన్ కొవిడ్ టీకాను మరోసారి తీసుకున్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్ పేర్కొన్నారు.