ఎఫ్-1, జే-1 వీసాలపై కొత్త నిబంధనలు..విద్యార్థులకు కష్టకాలమే..!
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాదిమంది అంతర్జాతీయ విద్యార్థులకు కష్టకాలం దాపురించింది. రోజుకో కఠిన నిబంధన అమల్లోకి తెస్తున్న అమెరికా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్-1 (విద్యార్థి), జే-1 (పరిశోధన) వీసాలపై నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితిని విధిస్తూ కొత్త నిబంధనను ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తమ డిగ్రీలు, పరిశోధనలు పూర్తికాకముందే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (ఎఫ్ఐఐడీఎస్) అనే భారత సంతతి పాలసీ గ్రూప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ కొత్త నిబంధనను జులై 16-17 తేదీల్లో ఖరారు చేసిందని, సెప్టెంబర్ మధ్య నుంచి ఇది అమల్లోకి రానుందని ఎఫ్ఐఐడీఎస్ తెలిపింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” (చదువు పూర్తయ్యే వరకు దేశంలో ఉండేందుకు అనుమతించే విధానం) విధానానికి ఈ కొత్త రూల్ స్వస్తి పలుకుతోంది.
ఇవి కూడా చదవండి
దీని ప్రకారం, విద్యార్థులు గరిష్ఠంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండగలరు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), ఎస్టీఈఎం ఓపీటీ సమయాన్ని కూడా ఈ నాలుగేళ్ల పరిమితిలోనే లెక్కిస్తారు. అంతేకాకుండా చదువు పూర్తయిన తర్వాత దేశంలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. గడువు పొడిగింపు కోసం విద్యార్థులు తప్పనిసరిగా యూఎస్సీఐఎస్ వద్ద ఫారం I-539 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
“ఇది అమెరికా తన పోటీతత్వానికి తనే పెట్టుకున్న గాయం వంటిదని నిపుణులు హెచ్చరించారు. ఆధునిక డిగ్రీలు పూర్తవడానికి పట్టే సమయానికి, ఈ నాలుగేళ్ల నిబంధనకు పొంతన లేదు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడానికి సగటున 52 నెలలు, పీహెచ్డీకి 5.7 ఏళ్లు పడుతుంది. మరోవైపు, యూఎస్సీఐఎస్ వద్ద ఇప్పటికే 1.1 కోట్లకు పైగా కేసులు పేరుకుపోయి, ప్రాసెసింగ్ సమయం ఏడాది పడుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు చదువులు, పరిశోధనలు మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. దీనివల్ల పరిశోధనశాలలు కీలక నిపుణులను కోల్పోతాయి. అమెరికా తన ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఇతర పోటీ దేశాలకు అప్పగించినట్లే అవుతుంది” అని ఆయన హెచ్చరించారు.
పీహెచ్డీ, వైద్య శిక్షణ వంటి అనేక పరిశోధనాత్మక ప్రోగ్రామ్లు సాధారణంగా నాలుగేళ్లకు మించి కొనసాగుతాయని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. జే-1 వీసాపై వచ్చే పరిశోధకులు, వైద్యులు తమ ప్రోగ్రామ్లను పూర్తి చేయడానికి 5 నుంచి 7 ఏళ్ల సమయం అవసరమని వివరించింది. వీసా పొడిగింపుపై అనిశ్చితి నెలకొనడం వల్ల పరిశోధనలకు ఆటంకం కలగడమే కాకుండా, గ్రాడ్యుయేషన్లు ఆలస్యమవుతాయని, అంతర్జాతీయ నిపుణులపై ఆధారపడిన ఫ్యాకల్టీ నియామకాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది.








