మన మాతృభాష తెలుగు – తరతరాల వారధి.. తానా పాఠశాల అధ్యక్షులు మాగులూరి భానుప్రకాష్
మన మాతృబాష తెలుగు. శిశువు పుట్టిన నాటి నుండి తల్లి, తండ్రి, గురువు ఇలా మొదలై ఈలోకం విడిచే వరకూ మనల్ని అంటిపెట్టుకొని నడిపించే ఏకైక శక్తి మాతృబాష. అమ్మా అన్న పిలుపు నుండి మొదలై మన వివేకం, విజ్ఞానం తో జీవితకాలం మన బంధాల, అనుబంధాల కలగలుపు తెలుగు. నేడు మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు మధ్య అంటరానికి సమాధానం తెలుగు. ప్రాచీన భాషగా గుర్తింపబడి మన ఘన చరిత్ర, గొప్పదనం, సంస్కృతీ, కళా, సాహిత్య రంగాల పురోభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పిన మాతృబాష మన తెలుగు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న రాయలు వారి వాక్కును అజరామరం చేస్తూ ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ గా పేరొందిన మన మృదు మధుర తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరం చిన్నారులకు చేరువ చేసే సత్ప్రయత్నమే “రీ కనెక్టింగ్ ది జనరేషన్స్”.
సాంకేతిక, కృత్రిమ మేధ రంగాలలో పట్టు సాధిస్తూ పురోగమిస్తున్న మనమంతా మన పిల్లలకు మాతృభాషను నేర్పి మన పెద్దలతో అనుసంధానం చేయటంలో మాత్రం వెనుకబడి పోతున్నాం. వారి మధ్య తరాల అంతరాన్ని పూరించే వారధి కేవలం తెలుగు భాష మాత్రమే. తమ మనవాళ్ళు, మన రాళ్లతో.. తాతయ్య నాయనమ్మ, అమ్మమ్మలు ప్రేమ, వాత్సల్యంతో మనసు విప్పి మాట్లాడినా, ఈ తరం చిన్నారులకు అత్యధిక భాగం పూర్తిగా అర్ధం కాని పరిస్థితి మనందరం సాక్షులమే. అందుకే మాతృభాషను కాపాడుకోవటం, రాబోయే తరాలకు అందించటం నందరి విధి, కర్తవ్యంగా భావిద్దాం.
తానా -పాఠశాల వేదికగా .. ” రీ కనెక్టింగ్ ది జనరేషన్స్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భాష ప్రాముఖ్యత, పెద్దల అనుభవాన్ని ఈ తరానికి చేరువ చేయటం, ఏ దేశమేగినా మనదైన ఘన చరిత్రను కాపాడుకునే ప్రయత్నంలో భాగం. అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, చిన్నారులతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏంటో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. ప్రతి ఒక్కరికీ మన మాతృబాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ తానా పాఠశాల వేదికగా ఈ తరం చిన్నారులకు తెలుగు భాషను పలుకు, అడుగు, పరుగు, వెలుగు అనే వార్షిక విభాగాల ద్వారా తెలుగును నేర్పిస్తున్నాం.. సరళంగా తెలుగులో సంభాషించుకునే విధంగా, చదవటం, రాయటం, మాట్లాడటం ప్రాధమిక అంశాలుగా పాఠశాల వేదికను వేలాది మంది తెలుగింటి చిన్నారులకు అందిస్తున్నాం.









