ఛార్లెట్ లో తానా త్రోబాల్, వాలీబాల్ టోర్నమెంట్లకు భారీ స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఛార్లెట్ లో ఆగస్టు 22వ తేదీన పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ మరియు మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 325 మంది క్రీడాకారులు, 25 మంది రిఫరీలు పాల్గొన్నారు.
NAFT-TANA నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కు కూడా మంచి స్పందన వచ్చింది. తానా, ఎన్ ఎ ఎఫ్ టీ కలిసి టోర్నమెంట్ నిర్వహించడం ఇది 3వ సారి. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న మహిళా టీమ్ లు చూపిన ప్రతిభ, ఉత్సాహం, స్ఫూర్తి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు టోర్నమెంట్లకు వచ్చిన ఆదరణ, అభిమానుల ఉత్సాహంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. 50 మంది వలంటీర్లు ఈ టోర్నమెంట్ల విజయానికి కృషి చేశారు. తానా జాతీయ నాయకులు ఈ టోర్నమెంట్ కు హాజరుకావడంతోపాటు పోటీలను నిర్వహించిన తానా అప్పలాచియాన్ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమం కోసం ఎన్నో గంటలు ప్లానింగ్, కోఆర్డినేషన్, కష్టపడి పనిచేసిన నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి, మరియు రవి (నాని) వడ్లమూడిని పలువురు అభినందించారు. తానా నేషనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ శివ చావా గారు కార్యక్రమానికి విచ్చేసి, ఈ వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చారు. ఈ క్రీడా వేడుక విజయవంతం కావడానికి విలువైన సహకారం అందించిన స్పాన్సర్లకు, వలంటీర్లకు తానా అప్పలాచియాన్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.











