ఆ కేసు నుంచి డొనాల్డ్ ట్రంప్ కు విముక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నమోదైన కేసుల్లో ఒక దాని నుంచి ఆయనకు విముక్తి లభించింది. ట్రంప్, ఆయన కంపెనీ పన్నులు ఎగ్గొట్టడానికి ఆస్తుల విలువను తక్కువ చేసి చూపినట్లు వచ్చిన ఆరోపణలపై 2021 నుంచి పరిశోధన జరిపిన న్యూయార్క్ ప్రాసిక్యూటర్ మిమీ రోకా తన దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్ సమీపంలో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ పై పన్నులు తగ్గించుకోవడానికి దాని విలువను తక్కువ చేసి చూపారన్నది ఆరోపణ. దానిపై రాజకీయ విభేదాలు, పార్టీ విధేయతలు, వ్యక్తిగత రాజకీయ భావజాలాలకు అతీతంగా స్వతంత్య్రంగా, వాస్తవికంగా దర్యాప్తు జరిపానని పాలక డెమోక్రటిక్ పార్టీ అభిమాని అయిన రోకా తెలిపారు. ఈ వ్యవహారంలో ట్రంప్ పై కానీ, ఆయన కంపెనీ ట్రంప్ ఆర్గనైజేషన్ మీద కానీ అభియోగాలేమీ నమోదు చేయలేదని తెలిపారు. ఇప్పటికే తన ప్రతిష్ఠతకు నష్టం జరిగిపోయిందని, తనపై పెట్టిన ఇతర బోగస్ కేసులను ఎప్పుడు ఉపసంహరిస్తారని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో ట్రంప్ ప్రశ్నించారు. రోకా దర్యాప్తు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని గతంలో ట్రంప్ ఆర్గనైజేషన్ విమర్శించింది.






