విస్కీ బాటిల్ మిస్.. అమెరికా విచారణ
విస్కీ బాటిల్ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800 డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు.
ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అసృష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఒక వస్తువు మాయం కావడంతో ఈ వార్త అక్కడ వైరల్గా మారింది.






