కాంగ్రెస్ పార్టీ తర్వాత సీపీఐకే సుదీర్ఘ రాజకీయ చరిత్ర : సురవరం
సీపీఐ 96వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని ముగ్ధుంభవన్లో ఆ పార్టీ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతులకు నష్టం కలిగిస్తాయని ఆరోపించారు. వీటిని రద్దు చేయాలని 80 వేల ట్రక్కులతో లక్షలాది మంది రైతులు దేశ రాజధాని డిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్నారన్నారు. బోగస్ రైతులతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
అదానీ, అంబానీల కోసమే ప్రధాన నూతన సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత సీపీఐకే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందన్నారు. దున్నేవాడిదే భూమి పోరాటం చేసింది సీసీఐ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. ఆకలి, కన్నీళ్లు ఉన్నన్ని రోజులు వామపక్ష పార్టీలు ఉంటాయని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో గెలుపోటములు సహజమన్నారు. రాష్ట్రంలో పాలకులకు అహంకారం పెరిగిందని ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.













