సర్ ప్రక్రియ డిజిటైజేషన్ 60 శాతం పూర్తి : సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ సర్ ప్రక్రియ 60 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. సంగారెడ్డి జిల్లా ( Sangareddy District) పటాన్ చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్ చెరు (Patancheru)లో బీఎల్వోలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Prateek Jain)తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సర్ ప్రక్రియపై బీఎల్వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శిబిరాల వద్ద వివిధ పార్టీలకు చెందిన వారు ఉండటాన్ని గమనించి మీకు పార్టీ నుంచి గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. సర్ గడువు పొడిగింపు తేదీని దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం అయిందని తెలిపారు. పీఎల్వో, బీఎల్వోల సహకారంతో సర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందకపోతే సూపర్ వైజర్లను అడిగి తీసుకోవాలన్నారు.








