అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలి.. ప్రజలకు మంత్రి పిలుపు
రాష్ట్ర ప్రజలంతా కలిసి కట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్లో ఏర్పాటు చేసిన ఏఎన్ఎంల 2వ మహాసభలకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు రెండో మహాసభలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు అందించిన విశేషమైన సేవలకు అభినందనలు తెలిపారు. మహమ్మారి సమయంలో వారు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య తెలంగాణలో భాగస్వాములు కావాలని, కలిసి కట్టుగా ఆరోగ్య తెలంగాణను నిర్మించుకోవాలని హరీష్ తెలిపారు. అనంతరం మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో 58 టిఫా స్కానింగ్ కేంద్రాలు ప్రారంభిస్తామని, అవి గర్భిణులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే దాదాపు 2 వేల పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2014లో ప్రభుత్వ దవాఖానాల్లో 30 శాతం డెలివరీలు అయ్యేవని, కానీ అవి ఇప్పుడు 67 శాతానికి పెరిగాయని, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉందని మంత్రి అన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్ఎంలు ఎంతో కష్టపడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తామూ కృషి చేస్తామని, కుదిరినంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాలను సూపర్ హిట్గా నిలిచాయని తెలిపారు. వీటి ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా, జ్వర ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని, జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు పెడుతున్నామని ప్రకటించారు. మొత్తం 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడున్న ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా మారుస్తామని తెలిపారు.













