అప్పటి వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి : మంత్రి ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎరువుల ధరల పెంపును సమర్థించుకునేలా బీజేపీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరి 5 ఏళ్లయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు. టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై పోరాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు రైతులకు వెచ్చించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. వ్యవసాయం సర్వ నాశనం కావడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమని నిప్పులు చెరిగారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో చెప్పాలని, తర్వాత చర్చకు వచ్చే దాని గురించి మాట్లాడాలన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్ను పొగడకున్నా పర్వాలేదు. తిడితే పాపం తగులుదుందన్నారు. రైతులకు కేసీఆర్ ఎంతో చేసిన మహానుభావుడని కొనియాడారు.













