నేను సీఎం అభ్యర్థి కాదు..
తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని, పార్టీ అదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగరేయడం కోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు.













