సిజెఐపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం
భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) సహా పలు ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ పదవినుంచి తొలగించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. సిజెఐను పదవినుంచి తొలగించడానికి ప్రతిపక్షాలు ముసాయిదా తీర్మానంపై సంతకాలు చేశాయని ఎన్సిపి సీనియర్ నేత డిపి త్రిపాఠీ ప్రకటించారు. తాము కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) ప్రకటించింది. న్యాయ వ్యవస్థకు స్వతంత్రత, ప్రశ్నించడానికి ఆస్కారం లేని సమగ్రత కల్పించడం కోసం ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నామని ఎస్పి నేత ఘన్శ్యామ్ తివారీ చెప్పారు.













