128 ఏళ్ల తరువాత మళ్లీ.. ఒలింపిక్స్ లో
విశ్వక్రీడలు ఒలింపిక్స్ లో క్రికెట్ను భాగం చేసేందుకు ఐసీసీ (ఇంటర్నెషనల్ క్రికెట్ కౌన్సిల్) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఐసీసీ ఒలింపిక్స్ లో జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ను చేర్చేందుకు ఐఓసీకి ప్రతిపాదించింది. దీనికోసం బిడ్ కూడా వేయనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రయత్నాలు ఫలించి, అన్ని అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో మనం క్రికెట్ను చూడొచ్చు. ఈ మేరకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం చేసేందుకు ఏర్పాటైన ఐసీసీ సభ్యుల బృందం వెల్లడించింది.
2028లో కచ్చితంగా ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండేటట్లు చూస్తామని కూడా వారు పేర్కొన్నారు. ఇది నిజంగా క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులుంటే వీరిలో 90 శాతం మంది ఒలింపిక్స్లో క్రికెట్ ఉండాలని కోరినట్లు ఈ సందర్భంగా ఐసీసీ వెల్లడించింది. 1900 ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో ఒకసారి క్రికెట్ను చేర్చారు. అప్పుడు కేవలం రెండు జట్లు మాత్రమే ఆడాయి. 2028లో కనుక మళ్లీ క్రికెట్ను ప్రవేశపెడితే 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఈ ఆటను చూసినట్లవుతుంది.













