కొవాగ్జిన్ అత్యంత సురక్షితం…ఆ విమర్శలు తప్పు! భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా

ఏ కరోనా వైరస్ను అయినా ఎదుర్కొనే సత్తా మా కొవాగ్జిన్ వ్యాక్సిన్కు ఉందని, దానికితోడు అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్ ఇది అని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. తాము అభివద్ధి చేసిన కొవాగ్జిన్ విషయంలో కొందరు రాజకీయ నాయకులు, పారిశ్రామిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ డాటాలో పారదర్శకత లేదన్నది అవాస్తవమని, తమ ప్రయోగ పద్ధతులను ఐసీఎంఆర్ ఆమోదించిందని పేర్కొన్నారు. ‘మాది ప్రపంచస్థాయి సంస్థ.. 200 శాతం నిజాయితీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం’ అని స్పష్టం చేశారు. కొవాగ్జిన్కు డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, ఎంతో శ్రమించి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను నీళ్లతో పోల్చడం ఒక శాస్త్రవేత్తగా తనను వేదనకు గురిచేసిందని చెప్పారు. ‘కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. గతంలో తక్కువ మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన సంస్థలకు అనుమతులు వచ్చాయి. కానీ, 25వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన మాపై ఆరోపణలు రావటం దారుణం. మూడో దశ ప్రయోగాల ఫలితాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. భారత్లోనే కాదు బ్రిటన్ సహా 12 దేశాల్లో ట్రయల్స్ నిర్వహించాం’ అన్నారు.
శాస్త్ర పరిశోధనల్లో తమకు ఎంతో అనుభవం ఉందని, ఇప్పటికే 16 వైరస్ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నామని తెలుపుతూ, ఇన్-యాక్టివేటెడ్ వైరస్తో ఎంతో భద్రమైన రికార్డు గల వీరో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ మీద ఈ ‘కొవాగ్జిన్’ తయారు చేసినట్లు చెప్పారు. మూడో దశ క్లినికల్ పరీక్షలను 26,000 మంది వాలంటీర్లపై నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 24,000 మంది వాలంటీర్లపై ప్రయోగాలు మొదలయ్యాయని అన్నారు. మూడో దశ పరీక్షల సమాచారం మార్చి తర్వాత తెలుస్తుందన్నారు.
యూకేలో జరిగిన పరీక్షల ఆధారంగా, మనదేశంలో కేవలం 100 మందిపై నిర్వహించిన ప్రయోగాల సమాచారంతోనే ఒక కంపెనీ టీకాకు అనుమతి ఇచ్చినప్పుడు, కొవాగ్జిన్కు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీకా తయారీలో పారదర్శకత లేదంటూ వచ్చిన విమర్శలను కూడా కృష్ణ ఎల్ల త్రోసిపుచ్చారు. ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటు డీసీజీఐకి అందించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జర్నల్స్లో ప్రచురించినట్లు తెలిపారు. ఫైజర్ 5 పరిశోధనా పత్రాలు ప్రచురిస్తే, తాము కూడా 5 పరిశోధనా పత్రాలు ప్రచురించామని, ఈ విధంగా తాము ఫైజర్కు ఏ మాత్రం తీసిపోమని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. మోడెర్నా, స్పుత్నిక్-ఆర్డీఐఎఫ్, కాన్సినో, సైనోఫామ్, సినోవ్యాక్ సంస్థల పరిశోధనా పత్రాలు 3 కంటే తక్కువని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెద్ద సంస్థలతో భారత్ బయోటెక్ పనిచేస్తోందని చెబుతూ, మూడో దశ క్లినికల్ పరీక్షల సమాచారాన్ని విశ్లేషించే బాధ్యతను ఇక్వియా అనే అమెరికా కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానికితోడు తమ టీకా ప్రయోగాల్లో కనిపించిన ‘సైడ్ ఎఫెక్ట్స్’ 10 శాతానికిలోపు మాత్రమే ఉంటే, ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రజెనెకా టీకాతో 60 శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని అన్నారు. అస్ట్రజెనెకా- ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లకు, దుష్ఫలితాలు బయటపడకుండా పారాసెట్మాల్ కూడా ఇచ్చారని, ఇటువంటివి తాము చేయలేదని పేర్కొన్నారు. మనదేశంలో ఇలా చేస్తే కంపెనీ మూసివేతకు డీసీజీఐ ఆదేశాలు ఇస్తుందని తెలిపారు. ఇతర సంస్థల టీకాలు ప్రధానంగా కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ‘కొవాగ్జిన్’ మాత్రం స్పైక్ప్రొటీన్తో పాటు నూక్లియోక్యాప్సిడ్ను సమర్థంగా నియంత్రిస్తుందన్నారు.
టీకా సరఫరా సన్నద్ధతపై స్పందిస్తూ, ఇప్పటికే తాము 2 కోట్ల డోసుల కొవాగ్జిన్ టీకా తయారు చేసి సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇందులో కసౌలిలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు 50 లక్షల డోసుల టీకా అందించామని వివరించారు. కొవాగ్జిన్ టీకా తయారీకి హైదరాబాద్లో మూడు యూనిట్లు, బెంగుళూరులో మరొక యూనిట్ సిద్ధం చేస్తున్నామని, నాలుగు యూనిట్లలో కలిసి ఏడాదికి 70 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది జులై- ఆగస్టు నాటికి 15 కోట్ల డోసుల టీకా సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఫౌండేషన్ల నుంచి కానీ నిధులు తీసుకోలేదని, ఎంతో రిస్కు తీసుకుని, పూర్తిగా సొంత నిధులతో ‘కొవాగ్జిన్’ టీకా అభివృద్ధి చేశామని అన్నారు.
యూకేలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ మీద కూడా ‘కొవాగ్జిన్’ టీకా పనిచేస్తుందని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. వైరస్ రూపాంతరం చెందడం మామూలేనని, ఈ మార్పులను దష్టిలో పెట్టుకునే టీకా రూపొందించినట్లు వివరించారు. ‘కొవాగ్జిన్’ మాత్రమే కాకుండా ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీకి సిద్ధమవుతున్నట్లు, దీనిపై క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ‘కొవాగ్జిన్’ టీకా ధర మొదట అధికంగా ఉన్నా, వాడకం పెరిగే కొద్దీ, ఉత్పత్తికి అనుగుణంగా ధర తగ్గుతుందని వివరించారు. రొటావైరస్ టీకాను 1 డాలర్కు ఇవ్వగలుగుతున్నామని, దీన్ని తయారు చేస్తున్న మెర్క్, జీఎస్కే, భారత్ బయోటెక్ సంస్థలకు చెందిన టీకాలు ఒకే నాణ్యతను కలిగి ఉన్నాయని తెలిపారు. ‘కొవాగ్జిన్’ టీకా ధర విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉందని అన్నారు.
తాము ఇప్పటివరకు 16 వ్యాక్సిన్లు తయారుచేశాం. 123 దేశాలకు సేవలందిస్తున్నామని, ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్లో భారత్ బయోటెక్ గురించి వ్యాసాలు ప్రచురితమైన విషయాన్ని కృష్ణ ఎల్లా పేర్కొంటూ, తాను వ్యాపారవేత్తను కానని, శాస్త్రవేత్తను మాత్రమే అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు’ అని కూడా కష్ణ ఎల్లా పేర్కొన్నారు. కోవిషీల్డ్ విషయంలో బ్రిటన్ డాటా ఆధారంగా అనుమతి ఇచ్చారని, భారత్లో ట్రయల్స్ జరుగకపోవడాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. భారత కంపెనీలను దెబ్బతీసే విధంగా చేసే దుష్ప్రచారాన్ని సహించబోమన్నారు. ‘కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్లో ఎలాంటి దాపరికం లేదు. మా వ్యాక్సిన్కు సంబంధించిన అన్ని వివరాలను ఐసీఎంఆర్, పుణె ఎన్ఐవీతో పంచుకున్నాం. బీఎస్ఎల్-3లో టీకాలు ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా ఉత్పత్తి జరుగటం లేదు. ఫైజర్, ఆస్ట్రాజెనికా, మోడెర్నా వంటి సంస్థలతో పోటీగా కొవాగ్జిన్ గురించి పబ్లికేషన్లు వచ్చాయి’ అని తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో కషిచేసిన శాస్త్రవేత్తలకు, పాల్గొన్న వలంటీర్లకు వ్యాక్సిన్ను అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.