అమెరికాలో భారత రాయబారిగా క్వాత్రా బాధ్యతలు
అమెరికాకు భారతదేశ కొత్త రాయబారిగా మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో రిటైర్ అయిన తరణ్జిత్ సింగ్ సంధు స్థానంలో క్వాత్రా బాధ్యతలు చేపట్టారు. సంధు 2020 నుంచి 2024 జనవరి వరకూ అమెరికా రాయబారిగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో ఆ దేశానికి భారత రాయబారిగా క్వాత్రా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
క్వాత్రా ఎవరు?
1988 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS) అధికారి అయిన వినయ్ మోహన్ క్వాత్రా 2022 మే 1 నుంచి 2024 జూలై 14 వరకూ భారతదేశ 34వ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఫారెన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేపాల్కు భారత రాయబారిగా పనిచేశారు. దౌత్యవేత్తగా 34 ఏళ్ల అనుభవం ఉన్న క్వాత్రా 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకూ ఫ్రాన్స్ రాయబారిగా పనిచేశారు. క్వాత్రా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క విధాన ప్రణాళిక- పరిశోధన విభాగానికి నాయకత్వం వహించారు.
జూలై 2013- అక్టోబరు 2015 మధ్య ఫారిన్లో అమెరికా విభాగానికి అధిపతిగా పనిచేశారు. మే 2010 నుండి జూలై 2013 వరకు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయంలో మంత్రి (వాణిజ్యం)గా కూడా పనిచేశాడు. 2015-2017 మధ్య ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2020 వరకు ఫ్రాన్స్కు రాయబారిగా ఉన్నారు.







