‘సింగ్ గీతం’ పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా- నిర్మాత నాగ్ అశ్విన్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్ విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘సింగ్ గీతం’ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?
-ఈ ప్రయాణం సింగీతం గారితోనే మొదలైంది. ఆయన ఈ కథను ఎప్పటినుంచో చేయాలని అనుకుంటున్నారు. కమల్ హాసన్ గారిని కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. పుష్పక విమానంకు ముందే ఈ కథను ఆయన కమల్ హాసన్ గారికి చెప్పారు. అయితే సంగీతం గారికి ఉన్న కొన్ని ప్రాజెక్టుల కారణంగా అది కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది.
-సింగీతం గారి సినిమాలు పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం ఇలా ఏ సినిమా తీసుకున్న టైం లెస్ గా వుంటాయి. ఇప్పటికీ పుష్పక విమానం చూస్తే చాలా రిలెవెంట్గా ఉంటుంది. బహుశా అది ఆయన మాయాబజార్ సినిమా నుంచి నేర్చుకున్న మెలకువ కావచ్చు. సింగ్ గీతం కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలా అనిపిస్తుంది.
మీరు నిర్మాతగా అనుకుంటే చాలా పెద్ద స్టార్స్తో ఈ సినిమా చేయొచ్చు. కానీ కొత్తవాళ్లతో తీయడానికి కారణం?
-ఇది పూర్తిగా సింగీతం గారి ఎంపిక. ఆయనకు కొత్త జనరేషన్తో పని చేయాలని ఉంటుంది. నటీనటులే కాదు, టెక్నీషియన్స్ కూడా ఎక్కువగా కొత్తవారే ఉండాలని భావిస్తారు. కొత్తవాళ్లతో పని చేయడంలో ఆయన చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు.
-అంతేకాకుండా ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో జరిగే కథ. పెద్ద స్టార్ నటీనటులు ఉంటే వారి ఇమేజ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొత్త ముఖాలు అయితే ప్రేక్షకులు ఆ ప్రపంచాన్ని మరింత సహజంగా ఫీల్ అవుతారు.
‘జాతిరత్నాలు’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను నిర్మించారు కదా. మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశాలు ఏమిటి?
-సినిమా నిర్మించడం నా ఫస్ట్ జాబ్ కాదు. ఒక కథ నచ్చి, ఆ కథను ఇంకెవరూ చేయలేరనిపించినప్పుడే నేను నిర్మిస్తాను. జాతిరత్నాలు కూడా అలాంటిదే. ఆ సమయంలో అలాంటి సినిమా ఎవరూ చేసేవారు కాదనిపించింది. సింగ్ గీతం కూడా అంతే. ఇది చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్. సింగీతం గారి విజన్పై, ఆయనపై ఉన్న ప్రేమతో ఈ సినిమాను చేశాను.
ఇది గోల్డ్కు సంబంధించిన బ్యాక్డ్రాప్లో ఉంటుందా?
-మహానటి తర్వాత సింగీతం గారు నాకు ఈ కథ చెప్పారు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్కు ఉన్న కనెక్షన్ ఏమిటనేది సింగీతం గారి సిగ్నేచర్ స్టైల్లో, ఆయన ట్రేడ్మార్క్ హ్యూమర్తో చెప్పడం జరిగింది. సింగీతం గారు ఏ కథను ఆలోచించినా అందులో హ్యూమానిటీ, హ్యూమర్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే టోన్ కనిపిస్తుంది.
సింగీతం గారి వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది?
-రైటింగ్, రిహార్సల్ ప్రాసెస్ చాలా లాంగ్గా ఉంటుంది. దాదాపు తొమ్మిది నెలలు మేము రైటింగ్లోనే ఉన్నాం. నటీనటులు ఫైనల్ అయిన తర్వాత రిహార్సల్స్ కూడా చేశాం. సింగీతం గారు చాలా స్పాంటేనియస్గా ఉంటారు. ఒకసారి ఏదైనా చెప్పి, తర్వాత ఆయనకే అది నచ్చకపోతే వెంటనే మార్చేస్తారు. “మీరే చెప్పారు కదా?” అంటే, “నేను తప్పు చేయకూడదా?” అంటారు. అలాంటి విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను.
-ఆయనతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నిజానికి ఆయనను కలవడమే గొప్ప విషయం. అలాంటిది రెండేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించడం, ప్రతిరోజూ మాట్లాడడం, సినిమా తీయడం మాటల్లో చెప్పలేని ఆనందం.
ఇప్పటి యూత్కు ఇది రిలెవెంట్గా ఉంటుందా?
-ఖచ్చితంగా రిలెవెంట్గా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ ప్రేక్షకులు కొద్దిసేపటికే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లిపోతారు. పోస్ట్ ప్రొడక్షన్లో సినిమా చూశాను. ప్రతి సీన్ చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. డైలాగ్స్ పాటల్లా వస్తున్నాయనే ఫీలింగ్ ఉండదు.
ఒక కొత్త తరం దర్శకుడిగా మీ ఇన్పుట్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా?
-నాకు అప్పుడప్పుడు నేను కొత్త తరం దర్శకుడినా కాదా అనే డౌట్ వస్తుంది (నవ్వుతూ). కానీ సింగీతం గారు మాత్రం 94 ఏళ్ల వయసులో కూడా కొత్త తరం దర్శకుడే. ఈ సినిమా కూడా ఒక టీనేజర్ తీసినట్టుగా ఉంటుంది.
-ఈ ప్రాజెక్ట్లో ప్రతి అడుగులో నేను ఉన్నాను. ప్రొడక్షన్లో, సెట్లో నిర్మాతగా మాత్రమే కాకుండా ఆయన విజన్ ని తీసుకురావడానికి అసిస్టెంట్ డైరెక్టర్లా కూడా వున్నానని అనుకోవచ్చు.
-వారం రోజులు చూసి మర్చిపోయే సినిమా కాదు ఇది. పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేశాం.
మీరు, సింగీతం గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అందరికీ పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలనే ఆలోచన ఉందా?
-ఆలోచన అయితే ఉంది. తమిళంలో రిలీజ్ అవుతోంది. మిగతా భాషల విషయానికి వస్తే ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల రూపంలో ఉంటాయి. కాబట్టి ప్రతి భాషలోనూ వాటిని మళ్లీ సంగీతబద్ధంగా రూపొందించాలి. అయితే ఖచ్చితంగా ఇతర భాషల్లో కూడా తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.
-సింగీతం గారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తారు. ఇలాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. మొదట మేము ఆయనపై ఉన్న ప్రేమతో ఈ సినిమా చేశాం. కానీ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటిది రావడం కష్టం. మన జనరేషన్కు సింగీతం గారు ఈ సినిమా ఇస్తున్నారంటే అంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి.
దేవిశ్రీ ప్రసాద్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన ఎంత ఎక్సైట్ అయ్యారు?
-దేవిశ్రీ గారు కూడా ఒక లెజెండ్. మ్యూజిక్ పరంగా ఇది చాలా ఛాలెంజింగ్ సినిమా. ఇది పూర్తిగా కొత్త అనుభవం. ఈ సినిమాలో నాన్స్టాప్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఎక్కడా “మ్యూజిక్ వింటున్నాం” అనే ఫీలింగ్ రాదు. అంత సహజంగా, ఎంటర్టైనింగ్గా చేశారు. అదే ఈ సినిమా సక్సెస్ అని భావిస్తాను.
అయాన్, అహల్య, శాలిని గురించి?
అయాన్, అహల్య చాలా టాలెంటెడ్ పెర్ఫార్మర్స్. వారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అయాన్ , శాలిని తెలుగువారు. అహల్య తెలుగు నేర్చుకుంది. వీళ్లకు భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు వస్తాయి.
ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు సక్సెస్ చేయడానికి ఎలాంటి కసరత్తు చేస్తుంటారు?
-ఏది సక్సెస్ అవుతుంది, ఏది కాదు అనేది ముందుగా ఎవరూ చెప్పలేరు. కానీ ఒక కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఆ నిజాయితీ ఉంటే విజయం దానంతట అదే వస్తుందని నమ్ముతాను.
పుష్పక విమానం కథ చెప్పినప్పుడు కూడా “మాటలు లేకుండా సినిమా ఏంటి?” అని చాలామంది అనుకుని ఉంటారు. కానీ ఆయన నిజాయితీగా తీశారు కాబట్టే నేటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నాం.
నేను మహానటి తీస్తానంటే కూడా “ఇప్పుడు అలాంటి సినిమా ఎవరు చూస్తారు?”అనే మాటలు వినిపించాయి. సినిమా పూర్తయ్యే వరకు ఎవరూ అంచనా వేయలేరు. మనం నిజాయితీని నమ్మితే విజయం దానంతట అదే వస్తుంది.
కల్కి 2 గురించి?
-కల్కి 2 ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యుగా షూటింగ్ చేసి శరవేగంగా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.








