చైనాకు అమెరికా షాక్.. 28 కంపెనీలను

చైనాపై అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా సంస్థలపై కక్షగట్టారు. ఇందులో భాగంగా చైనాకు సంబందించిన మరికొన్ని సంస్థలను బ్లాక్లిస్ట్లోకి తరలించారు. 31 చైనా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయకుండా గత అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకుంటే ఇప్పుడు మరో 28 కంపెనీలపై ఆంక్షలను విధించిన బైడెన్ ఆ సంఖ్యను 59కి పెంచారు. అమెరికా భద్రత లేదా ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కే, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనను సులభతరం చేసేందుకు వినియోగించే చైనా నిఘా సాంకేతిక పరిజ్ఞానంతో భాగస్వాములైన కంపెనీలపై ఈ ఆంక్షలు విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
తొలి జాబితాలో చైనా మొబైల్, చైనా టెలికాం, వీడియో నిఘా సంస్థలు హిక్ విజన్, చైనా రైల్వేవ కన్స్ట్రక్షన్ కార్ఫ్ వంటి ప్రధాన టెలికాం సంస్థలు, కన్స్ట్రక్షన్, టెక్నాలజీ సంస్థలపై ట్రంప్ సర్కార్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్దం జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తమ కంపెనీలను బ్లాక్లిస్టులో పెట్టినట్లు చైనా ఆరోపించింది. మన పరిశ్రమలపై దాడి చేస్తున్న చైనాను అడ్డుకోవాలని ఇటీవల కొందరు రిపబ్లికన్, డెమోక్రటిక్ సేనేటర్లు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.