షెడ్యూల్ ప్రకారమే.. ముందస్తు వెళ్లాలనే ఆలోచన లేదు : కేసీఆర్
తెలంగాణ శాసనసభకు 2023 చివరిలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్కు 98కి పైగా స్థానాలు గెలిచి అధికారం చేపడుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిగితే నష్టమనే భావనతో గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లామని, ఈసారి అలాంటి అవసరం లేదన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలోనే సాధించి చూపిందని తెలిపారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలకపాత్ర పోషిస్తామన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబరు 15న 10 లక్షల మదితో వరంగల్ విజయగర్జన సభను నిర్వహిస్తామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదు. మనం అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉంటాం. కేంద్రంలో అధికారం కోసం ఇతర పార్టీలకు మన అవసరం ఉంటుంది. అప్పుడు మనమే చక్రం తిప్పుతాం అని అన్నారు.













