కాంగ్రెస్ పార్టీకి షాక్.. మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఆ పార్టీకి ఎంతో కాలంగా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో తను పార్టీ మారబోతున్నట్టు మర్రి సంకేతాలిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాధగానే కాంగ్రెస్తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని తెలిపారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నానని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని వెల్లడించారు.













