గత ప్రభుత్వంలో జరిగేవి.. ఇప్పుడు అలాంటీవేవీ లేకుండానే

తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తూ చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాటలు ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్లో పెట్టింది. రైతు భరోసాకు సంబంధించి రూ.6 వేల కోట్లకు పైగా చెల్లింపులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈ నెలలో రూ.370 కోట్ల చెల్లింపులు చేశాం. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం, ప్రజలకు కాదు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. టానిక్లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశాం. తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నాం. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావు. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయి. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తాం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం అని తెలిపారు.