ఎయిడెడ్ పాఠశాలలపై లోకేష్ క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శాసనమండలిలో స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ.. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (అడ్మిషన్లు) తగ్గడంపై వచ్చిన ప్రశ్నలకూ మంత్రి లోకేష్ పూర్తి గణాంకాలతో సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 1.69 శాతం తగ్గినట్లు ఆయన అంగీకరించారు. అయితే, ఆ తర్వాతి విద్యా సంవత్సరం లోనే లోపాలను సరిదిద్ది మౌలిక వసతులు మెరుగుపరచడంతో.. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు 0.94 శాతం పెరిగాయని మంత్రి సభకు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుండటం వల్లే మళ్లీ విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అడ్మిషన్ల శాతాన్ని మరింతగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేలా ప్రభుత్వ విద్యా ప్రమాణాలను మరింత ఉన్నతీకరిస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు.








