కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష శంకుస్థాపన
రూ.3,100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న దాల్మియా భారత్ సిమెంట్
జమ్మలమడుగు: కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ప్లాంట్ ఆవరణకు చేరుకున్న మంత్రి లోకేష్ కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ముందుగా దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించి వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం పునీత్ దాల్మియాతో కలిసి దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
రూ.3,100 కోట్ల పెట్టుబడి పెట్టనున్న దాల్మియా భారత్ సిమెంట్
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణను రూ.3,100 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో ప్లాంటులో దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్తప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాంట్ విస్తరణతో కొత్తగా 1000 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీ.ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డప్పగారి మాధవి రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ సీహెచ్ భూపేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, దాల్మియా భారత్ లిమిటెడ్ గ్రోత్ అండ్ ఎక్స్ పాన్షన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేసీ బిర్లా, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ వామనరావు జిర్కుంత్వార్, ప్లాంట్ హెడ్ అర్పన్ పరేఖ్, ప్రాజెక్ట్ హెడ్ అనుపమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.








