తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల శ్రీవారికి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు అందించారు. తొలుత బేడీ ఆంజనేయ స్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు సంప్రదాయ బద్దంగా ముఖ్యమంత్రికి తలపాగా చుట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, వేళతాళాల నడుమ శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి మళ్లీ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి పయనమవుతారు.













