ఫేస్బుక్ కీలక నిర్ణయం… ఆ పోస్టులను ఇక తొలగించం

కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తును ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ నిఘా విభాగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి చైనా ప్రయోగశాల కూడా కారణమనే అంశాన్నీ దర్యాప్తు పరిధిలో చేర్చే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా వాస్తవాలను వెల్లడించాలంటూ వివిధ దేశాలు చేస్తున్న డిమాండ్లతో బైడెన్ పాలనా యంత్రాంగం కూడా స్వరం కలిపినట్లయ్యింది. ఈ పరిస్థితుల్లో కరోనాపై అసత్యపు ప్రచారమనే అభిప్రాయంతో ఇప్పటి వరకూ తొలగిస్తూ వస్తున్న కరోనా మానవ సృష్టే లేదా ప్రయోగశాలలో రూపొందించిందే వంటి ఆరోపణలతో కూడిన పోస్టులను తమ యాప్ల నుంచి తొలగించబోమని ఫేస్బుక్ (ఇంటిగ్రిటి) వైస్ ప్రెసిడెంట్ రోజెన్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాకు సంబంధించి అసత్య సమాచారం సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతోందనే అభిప్రాయంతో అలాంటి పోస్టులన్నిటినీ ఎప్పటికప్పుడు తీసివేసేందుకు ఫేస్బుక్ యంత్రాంగం శ్రమిస్తోంది. వాటిపై హెచ్చరిక లేబుల్స్ ను పెడుతోంది.