వైట్హౌస్లో మరోసారి కరోనా కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార నివాసం వైట్హౌస్లో మరోసారి కరోనా కలకలం రేగింది. వైట్ హౌస్ సిబ్బంది ఒకరికి తాజాగా కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గురు ప్రపంచ నాయకులతో కలిసి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసిన మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైట్ హౌస్ బ్రీఫింగ్ సందర్భంగా, అధ్యక్షుడు ట్రంప్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని ధృవీకరించారు. కానీ అతనితో తనకు సంబంధం లేదనీ, సన్నిహితంగా మెలగలేదని ట్రంప్ వివరించారు. వైట్హౌస్ సమావేశానికి కరోనా ప్రభావిత వ్యక్తి చాలా దూరంగా ఉన్నారనీ, వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నానీ తెలిపారు. బాధిత వ్యక్తీ మీడియాకు దగ్గరిగా లేడనీ, సమావేశాన్ని ప్రభావితం చేయలేదనీ, మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా మార్చి నెలలో తొలిసారి వైట్హౌస్లో కరోనా కలకలం రేపింది. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్కు కరోనా సోకిన సంగతి తెలిసందే.






