ఆ ఆలయంలో 400 మందికి కరోనా..
ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400 మంది సేవకులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు. పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోన్న సమయంలో తాజా విషయం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నుంచి ఇక్కడ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. పూరీ ఆలయంలో ఇప్పటివరకు మొత్తం 404 మందికి వైరస్ సోకింది. వీరిలో 351 మంది సేవకులు ఉండగా, మరో 53 మంది సిబ్బంది ఉన్నారు. వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని జగన్నాథ ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్ కుమార్ జేనా వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఎక్కువగా హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ నిర్వహణకు సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే,నిత్యం జరిగే పూజలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆలయ పర్యవేక్షణాధికారి సృష్టం చేశారు.
పూరీ రథయాత్ర అనంతరం 822 మంది ఆలయ సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించగా కేవలం ఇద్దరికి మాత్రమే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేవలం ఒక్కనెల వ్యవధిలోనే 400 మందికి వైరస్ సోకింది. ఇదే విషయాన్ని ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయంలో భక్తుల సందర్శనకు అనుమతిస్తే మరింత మంది సేవకులు, సిబ్బంది వైరస్ బారినపడే అవకాశాలుంటాయని పేర్కొంది. కరోనా నిబంధనలను సిబ్బంది తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పర్యవేక్షణ అధికారులు సృష్టం చేశారు. మరో నెల రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.






