ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది…

ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గుడువులోపే ఇవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాట్జిన్ టీకాలు ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఉత్పత్తి అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. వ్యాక్సిన్ల జీవిత కాలం ఆరు నెలలే కావడంతో వాటిని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని తయారీ సంస్థలు సూచిస్తున్నాయి.
ఈ వ్యాక్సిన్లలో చాలా వాటిని గతేడాది అక్టోబర్, నవంబర్లలోనే తయారు చేశారు. ముఖ్యంగా సీరమ్ ఇన్స్టిట్యూట్కు ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ సంస్థ కోట్ల కొద్దీ డోసులను సిద్ధం చేసి ఉంచింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ డోసులు కోల్డ్ స్టోరేజ్లలో నెలల పాటు ఉన్నాయి. ఇప్పుడు వీటిని సాధ్యమైనంత తర్వగా వాడాల్సి ఉంది. ఇప్పటికే ఇలాంటి 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి పంపిణీ చేశామని, వీటిని వాటి ఎక్స్పైరీ డేటా ప్రకారం వారాలు లేదా నెలలలోపే వాడాల్సి ఉందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ అంటున్నారు.
వ్యాక్సిన్లు భారీ సంఖ్యలో ఉన్నా.. వాటి వాడకం మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం దగ్గర 2 కోట్ల డోసులు ఉన్నా.. ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మందికే వ్యాక్సిన్ ఇచ్చారు. సీరమ్ దగ్గర మరో 5-6 కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా నెలవారీగా మరో 5-6 కోట్ల డోసులను తయారు చేయాలని సీరమ్ భావిస్తోంది. ఏప్రిల్ నాటికి దీనిని పది కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అటు భారత్ బయోటెక్ దగ్గర కూడా 2 కోట్ల వరకూ కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. ఆ సంస్థ ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేయాలని చూస్తోంది. జనవరి 16న ఇండియాలో వ్యాక్యినేషన్ ప్రారంభమైనా.. వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇప్పటికే చాలా మంది వెనుకాడుతున్నారు. అయితే ఇవన్నీ చాలా ఖరీదైన వ్యాక్సిన్లనీ, వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం వినియోగించాలని సురేవ్ జాదవ్ చెబుతున్నారు.