ఎంతెంత దూరం? వ్యాక్సిన్ మార్చి నెలలో
ఆగస్టు 15న మన దేశానికి కరోనా నుంచి విముక్తి లభిస్తుందని అనుకున్న ఆశలు వమ్మయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబరు, లేదా నవంబరుకల్లా రావచ్చునని అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ వస్తుందన్నా అది కూడా సందేహాస్పదంగానే ఉంది. తానే ఫస్ట్ అంటూ ప్రకటించిన రష్యా వ్యాక్సిన్ తర్వాత ఎక్కడా పెద్దగా చప్పుడు చేయడం లేదు. మరోవైపు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తా భారత్కు ఉందని బిల్గేట్స్ లాంటి ప్రముఖులు చెప్పే ఓదార్పు మాటలే ఊరట. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ కోరలు అంతకంతకూ విస్త్రుతం అవుతున్న పరిస్థితిలో ఇక ఈ ఏడాది వ్యాక్సిన్ రాకపోవచ్చునని కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో మంత్రి ప్రకటించారు.
మార్చికల్లా…రావచ్చు…
క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే తెలిపారు. రాజ్యసభలో ఆదివారం వైఎస్సార్సీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు. ఆ విధంగా అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్, అహ్మదాబాద్కు చెందిన కాడిలా హెల్త్కేర్, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి మరో 30 విభాగాల వరకు వ్యాక్సిన్ పరిశోధనలకు సాయపడుతున్నట్లు వివరించారు.
టెస్టుల్లో టాప్లో ఆంధ్రప్రదేశ్…
కోవిడ్ 19 టెస్ట్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్ -19 టెస్ట్లు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.






