ఏపీలో కొత్తగా 7,948 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,367, కర్నూలులో 1,146 గుంటూరులో 945 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,296కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 56,527 ఉండగా, 52,622 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా 58 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,148కి చేరింది.
గుంటూరు జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కడపలో ముగ్గురు మృత్యువాత పడగా.. కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఒక్క రోజులో 62,979 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 17,49,425 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.






