ఏపీలో కరోనా విజృంభణ
ఆంధప్రదేశ్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాల్లో 1,441 కేసులు, కర్నూలు జిల్లాల్లో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 69,252 ఉండగా.. 60,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కరోనా బారిన పడి 68 మంది మరణించారు.
తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున అనంతపురం.. కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున.. కృష్ణా జిల్లాలో ముగ్గురు.. నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 1,281కి చేరాయి. గత 24 గంటల్లో 70,086 శాంపిల్స్ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొంది.






