Mass Jathara: ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక
అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రంతో రవితేజ జాతర చూడబోతున్నాం : ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ కథానాయకుడు సూర్య
‘మాస్ జాతర’ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది : అభిమానులకు మాస్ మహారాజా రవితేజ హామీ
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “రవితేజ గారి అభిమానులను, నా అభిమానులను ఇలా చూడటం ఆనందంగా ఉంది. అభిమానుల మధ్యలో జరిగే ఇలాంటి వేడుకకు హాజరవ్వడం నాకిష్టం. నన్ను ఆహ్వానించిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. రవితేజ గారితో నాది 20 ఏళ్ళ అనుబంధం. ఈ రోజు ఒక ఫ్యాన్ బాయ్ లా మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ గారు. చాలా ఏళ్లుగా రవితేజ గారిపై అభిమానులు ఎంతో ప్రేమని కురిపిస్తున్నారు. తెరపై ఒక కామన్ మ్యాన్ ని కింగ్ సైజ్ లో సహజంగా చూపించాలంటే అది రవితేజ గారికే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ గారు మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఆయన చేస్తారు. ఇడియట్, కిక్ సహా రవితేజ గారు నటించిన పలు సినిమాలు తమిళ్ లోనూ మంచి ఆదరణ పొందాయి.
విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రవితేజ గారిలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు. రజినీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ గారు కూడా అలాగే అలరిస్తారు. రవితేజ గారు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ గారి జాతర చూడబోతున్నాం. రవితేజ గారిపై దర్శకుడు భానుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్ గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ గారు ఎందరికో స్ఫూర్తి. నాగవంశీ గారు వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్ లో నేను ఒక సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాము. అక్టోబర్ 31 విడుదలవుతున్న మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “నాకిష్టమైన వ్యక్తుల్లో ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు ఒకరు. ఆయన వేసిన సెట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ బాగుందంటే ఆ క్రెడిట్ మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీకి వెళ్తుంది. మా సంగీత దర్శకుడు భీమ్స్ ఇంకో చార్ట్ బస్టర్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ మీరు థియేటర్ లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. మా డీఓపీ విధు వర్క్ మీ అందరికీ నచ్చుతుంది. శివుడు పాత్ర చేసిన నవీన్ గురించి మాట్లాడాలి. నవీన్ ఇలా కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. నటుడిగా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలయ్యాక శివుడు పాత్ర గురించి మాట్లాడుకుంటారు. రాజా ది గ్రేట్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించాను. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది.
మా కాంబినేషన్ ని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారని అనుకుంటున్నాను. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. ఫుల్ మాస్ పాత్ర చేసింది. ఈరోజు గెస్ట్ గా విచ్చేసిన సూర్య గారికి థాంక్యూ సో మచ్. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు భానుకి అభిమానులు ఏర్పడతారు. మాస్ మాత్రమే కాదు, అన్ని రకాల సినిమాలు చేయగలడు. రచయిత నందుకి మంచి భవిష్యత్తు ఉంది. మాస్ జాతర చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా అభిమానులను అసలు నిరాశపర్చదు. ఇది నా హామీ.” అన్నారు.
కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “పెళ్లి సందడి విడుదలకు ముందు రవితేజ గారితో ధమాకా సినిమా చేశాను. ధమాకా తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రవితేజ గారు ఎప్పుడు హుషారుగా ఉంటారు. ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండటం రవితేజ గారిని చూసి నేర్చుకోవచ్చు. రవితేజ గారి అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో మాస్ జాతర అలా ఉంటుంది. భాను గారు అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. ఇంత మాస్ గా నన్ను నేను ఎప్పుడూ చూసుకోలేదు. నాకు, రవితేజ గారి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి సన్నివేశాలు చాలా బాగుంటాయి. చిత్రీకరణ సమయంలో రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మీ వేడుకకు వచ్చిన సూర్య గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, సితార బ్యానర్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మాస్ జాతర చిత్రంలో నేను పూర్తి కొత్తగా కనిపిస్తాను. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు.” అన్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “అన్ని మసాలాలు సరిగ్గా ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ఆ లోటుని తీర్చే సినిమా ఈ మాస్ జాతర. ఈ చిత్రం చూసి మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా ఎందరో హీరోలతో కలిసి నటించాను. కానీ, రవితేజతో నటించలేదు. ‘మాస్ జాతర’ లాంటి మంచి సినిమా చేయాలనే ఇంత సమయం పట్టినట్టుంది. దర్శకుడు భాను అద్భుతమైన సినిమాని రూపొందించాడు. సినిమా ఎలా ఉంటుంది? నా పాత్ర ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు చెప్పను. మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూసి ఆనందించాల్సిన చిత్రమిది. మేమందరం భయం భక్తులతో ఈ సినిమా చేశాము. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. అద్భుతమైన మాస్ సినిమా ఇది. ‘మాస్ జాతర’ సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులంతా మమ్మల్ని మెచ్చుకుంటారు.” అన్నారు.
నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ.. “చాలారోజుల తర్వాత మాస్ జాతర రూపంలో శక్తివంతమైన పాత్ర లభించింది. రవితేజ గారిని అభిమానించే నేను, ఈరోజు ఇలా మాస్ జాతర ఈవెంట్ లో మాట్లాడతానని అసలు ఊహించలేదు. రవితేజ గారు, సూర్య గారు అంటే నాకెంతో అభిమానం. వాళ్ళు ముందు నిల్చొని మాట్లాడటం నాకు డబుల్ ధమాకాలా ఉంది. రవితేజ గారు నా లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మనిషిగా ఎలా ఉండాలి, మనిషిగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేను రవితేజ గారిని చూసి నేర్చుకున్నాను. శివుడు అనే అద్భుతమైన పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు భాను గారికి ధన్యవాదాలు. ‘అరవింద సమేత’లో బాలరెడ్డి పాత్ర తర్వాత నా కెరీర్ లో గుర్తిండిపోయే పాత్ర ఇది. ఈ పాత్ర ఇంత బాగా రావడానికి కారణం రవితేజ గారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘అరవింద సమేత’లో బాలరెడ్డి పాత్రతో నటుడిగా నాకు మరో జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు శివుడు రూపంలో మరో గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా గురించి హృదయపూర్వకంగా ఒక మాట చెప్తాను. ఈసారి జాతర గట్టిగా ఉంటుంది. అక్టోబర్ 31న విడుదలవుతున్న ఈ సినిమా అసలు నిరాశ పరచదు. ముఖ్యంగా రవితేజ గారి అభిమానులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ గారి సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్ కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమాల కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది. ఈ వేడుకకు విచ్చేసిన సూర్య గారికి ధన్యవాదాలు.” అన్నారు.
దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. “రవితేజ గారి అభిమానులకు నా కృతఙ్ఞతలు. నేనూ మీలో ఒకడినే. మీ నుండే ఇక్కడికి వచ్చాను. సూర్య గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. రవితేజ గారు దర్శకులను పరిచయం చేసే ఒక యూనివర్సిటీ నెలకొల్పారు. ఆ యూనివర్సిటీలో సీట్ ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతానని ఆశిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత నా కథ. ఆ కథ నచ్చి రవితేజ గారు నాకు అవకాశమిచ్చారు. నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలో మొదటి సినిమా చేసే అవకాశం వచ్చేలా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి నేను అభిమానిని. ఇందులో ఆయన పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల గారు పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర గారి పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా అయినప్పటికీ, భీమ్స్ గారు ఎంతో అండగా నిలిచారు. అద్భుతమైన సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇచ్చిన మద్దతుని ఎప్పటికీ మరిచిపోలేను. నా దృష్టిలో నాగవంశీ గారి కంటే గొప్ప క్రిటిక్ లేరు. ఆయనకు సినిమా నచ్చిందంటే అది హిట్టే. వంశీ గారు ఈ సినిమా చూసి చాలా బాగుంది అన్నారు. అక్టోబర్ 31 కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను.” అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. “ధమాకా తర్వాత చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాను. నా ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక మానసిక స్థైర్యం ఒకరున్నారు. ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, ఎలా బ్రతకాలి, రేపు ఎలా గడపాలి? అనే సందేహంలో నేను, నా కుటుంబం ఉన్న సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి అవకాశం వచ్చింది. అదే ధమాకా. ఆ సమయంలో నా వెనుక ఓ దేవుడిలా నిలబడిన ఆ వ్యక్తి పేరు, ఆ శక్తి పేరు రవితేజ గారు. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి ఉన్నానంటే దానికి కారణం రవితేజ గారు. అందుకే, ఆయనపై నాకున్న ప్రేమను పాటల రూపంలో చూపిస్తుంటాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు.” అన్నారు.
ఈ వేడుకలో దర్శకులు శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న, కళా దర్శకుడు శ్రీ నాగేంద్ర తంగాల తదితరులు పాల్గొని ‘మాస్ జాతర’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.







