వీసా జారీలో జాప్యం తప్పదు… కొవిడ్ పరిస్థితులే
వలసేతర (నాన్ ఇమ్మిగ్రెంట్ ) విభాగాల్లో వీసా అపాయింట్మెంట్/ జారీ ప్రక్రియల కోసం సాధారణంతో పోలిస్తే ప్రస్తుతం కొంత సమయం ఎదురుచూడక తప్పదని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొవిడ్ మహమ్మారితో ఏర్పడిన అవాంతరాల నుంచి కోలుకోని పరిస్థితులు ఇప్పుడిప్పుడే తిరిగి పట్టాలెక్కుతుండటమే అందుకు కారణమని తెలిపింది. నూతన అంతర్జాతీయ విమానాయాన విధానం ప్రకారం భారత్ నుంచి దాదాపు 30 లక్షల మంది వీసాదారులు ఈ నెల 8 నుంచి అమెరికా వెళ్లేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. కొవిడ్ టీకా తీసుకున్నట్లు ప్రయాణానికి ముందు వారు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కొవిషీల్డ్కు అత్యవసర వినియోగ అనుమతి దక్కిన నేపథ్యంలో ఆ టీకా వేసుకున్నవారినీ ప్రయాణానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.






