TTD: వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ క్లారిటీ..!
వైకుంఠ ద్వారా దర్శనం అనగానే తిరుమల శ్రీవారి(Tirumala) భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యం కోసం క్యూ కడుతూ ఉంటారు. దీనితో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విధంగా చర్యలు చేపడుతోంది. టీటీడీ అధికారులు దాదాపు మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆన్లైన్ టికెట్ లు కూడా రిలీజ్ చేసింది. లాటరీ విధానంలో వాటిని భక్తులకు కేటాయించారు టీటీడీ అధికారులు. ఈ నేపధ్యంలో పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
తాజాగా దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కీలక ప్రకటన చేసారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం 2 నెలలుగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రుల సబ్ కమిటీ కూడా టీటీడీతో నిరంతరం సమీక్షిస్తోందన్న ఆయన.. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, టోకెన్లు లేని వారికి తిరుమలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అలాంటి ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసారు. తిరుమలకు భక్తుల అనుమతిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. జనవరి 2 నుంచి 7 వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కోరుతున్నానని తెలిపారు.






