ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అందరూ అనుకున్నట్టే.. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ఆయనకు 516 ఓట్లు రాగా.. యూపిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. 272 ఓట్ల తేడాతో విజయం సాధించారు వెంకయ్య. 13వ ఉపరాష్ట్రపతిగా ఆగస్ట్ 11న ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకూ పార్లమెంట్ ఆవరణలో ఓటింగ్ జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటేశారు. ఒక రాజ్యసభ సభ్యుడే రాజ్యసభ చైర్మెన్ కావడం ఇదే తొలిసారి. వెంకయ్య గెలుపుతో ఎన్డీయే పక్షాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 98 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 785 మందిలో … 771 ఓట్లు పోలయ్యాయి. 14 మంది ఎంపీలు ఓటింగ్ కు గైర్హజయ్యారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి 790 స్థానాలుండగా… లోక్ సభ లో రెండు, రాజ్యసభలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీకి చెందిన లోక్ సభ సభ్యుడు చెడి పాశ్వాన్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుండడంతో.. ఆయన్ను ఓటింగ్ నుంచి నిషేధించారు.
వెంకయ్య… రాజకీయ జీవితం
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జులై 1న జన్మించారు వెంకయ్యనాయుడు. నెల్లురులోని వీఆర్ కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 1973 నుంచి 1974 మధ్యకాలంలో ఆంధ్రవిశ్వవిద్యాయలంలో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయంలో తొలి అడుగులు వేశారు. విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1974లో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని విద్యార్థఇ ఛాత్ర సంఘర్ష్ సమితికి కన్వీనర్ గా పనిచేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే RSS లో శిక్షణ పొందారు. తర్వాత… కాలేజీలో ABVP లో జాయిన్ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు వెంకయ్య. 1977 నుంచి 1980 వరకు బీజేపీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వెంకయ్యనాయుడు. 1978 లో మొదటిసారి, 1983లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. 1980 లో బీజేపీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1980 మధ్యకాలంలో ఎమర్జెన్సీ టైంలో జైలు జీవితం కూడా గడిపారు. 1985 లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. 1988 లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వెంకయ్య. 1998 లో మొదటిసారి రాజ్యసభకు వెళ్లారు. 2000 లో వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత.. 2002 జులై 1 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే టైంలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో.. జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2005 లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
కర్ణాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకు వెళ్లారు వెంకయ్య. సభ్యుడిగా ఉన్న ఆయన.. కేంద్ర గృహనిర్మాణ, సమాచార ప్రసారాల శాఖలకు మంత్రిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. ఇప్పుడు మరో పెద్ద పదవిని అలంకరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి పదవిని ఉత్తరాది వ్యక్తి రాంనాథ్ కోవింద్ కు ఇవ్వడంతో… ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాది వారికి ఇవ్వాలని RSS సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ తక్కువమంది సభ్యులు ఉన్నారు.. అపోజిషన్ పార్టీలదే రాజ్యసభలో అప్పర్ హ్యాండ్. దీంతో.. వారిని కంట్రోల్ చేయాలంటే బలమైన వ్యక్తి చైర్మన్ సీట్లో ఉండాలని బీజేపి ఆలోచన. అందుకే వెంకయ్య పేరును ఫైనలైజ్ చేసింది.













