హైదరాబాద్ లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు ఆసక్తి : జయేశ్ రంజన్
దేశ, విదేశీ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. హైదరాబాద్లోని ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏఐసీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ చాప్టర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో సుమారు 200 యూఎస్ కాన్సులేట్లు ఉన్నాయని, అందులో హైదరాబాద్ కాన్సులేట్ నుంచే ఎక్కువ వీసాలు జారీ అవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు ఆసక్తి చూపడం గొప్పవిషయమని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 18 దేశాల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. అందులో అమెరికా కంపెనీల పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.













