విశాఖ ఘటన దురదృష్టకరం : కేసీఆర్
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ కావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావడంతో ఇప్పటికే 11 మంది చనిపోయారు. సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశువులు, పక్షులు, ప్రాణాలు కోల్పోయాయి. చెట్లు మాడిపోయాయి. ఈ రసాయన వాయువును పీల్చిన కొందరైతే ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. సొమ్మసిల్లి రోడ్లపైనే పడిపోయారు. మొత్తానికి విశాఖ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.













