బండి సంజయ్ కు ఊరట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఊరట లభించింది. తనకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది. పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సంజయ్కు ఏప్రిల్ 6న బెయిల్ మంజూరైంది. అయితే, సంజయ్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, ఆయనకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈ నెల 17న పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మట్ట సరిత ఇరుపక్షాల వాదనలను విన్నారు. తదుపరి వాదనల కోసం కేసును వాయిదా వేశారు. ఇరువర్గాల నుంచి ఎలాంటి వాదనలు లేకపోవడంతో తీర్పు వెల్లడిని గురువారానికి వాయిదా వేశారు. బెయిల్ రద్దుకు సహేతుక కారణాలు లేవని సంజయ్ తరపు న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసుల పిటిషన్ను కొట్టివేసింది.













